మమ్మల్ని దేశద్రోహుల్లా అరెస్ట్ చేశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

byసూర్య | Mon, Sep 23, 2024, 09:09 PM

గాంధీ హాస్పిటల్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలన కోసం బీఆర్ఎస్ ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. గాంధీ ఆస్పత్రిలో ఒక్క ఆగస్టు నెలలో 48 మంది శిశువులు, 14 మంది బాలింతలు చనిపోయారనే ఆరోపణలు రావటంతో పార్టీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అధ్యక్షుడిగా డాక్టర్లు అయిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సభ్యులుగా ఈ కమిటీని నియమించారు.


రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కోరగా ఇవాళ ఈ కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రిని పరిశీలించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రాజయ్యను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే అరెస్ట్ చేయగా.. కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, హైదరాబాద్ పార్టీ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ ముగ్గురు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అనుమతించలేదు.


దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించారు. వాహనంలో ఉండగానే ఎమ్మెల్యేలు, సంజయ్, గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఓ వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేసి దేశ ద్రోహుల్లా.. నక్సలైట్లుగా.. గుండాలుగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది పోలీసులకు కూడా తెలియదని.. నగరం మెుత్తం తిప్పుతున్నారని మండిపడ్డారు. గవర్నమెంట్ ఆదేశాలతో పోలీసులు తమను వ్యాన్లలో కుక్కి తీసుకెళ్తున్నారని ఫైరయ్యారు.


ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు వారిని వెంటనే విడుదల చేయాలని, ఆసుపత్రులలోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే, స్వయంగా డాక్టర్లు అయిన తమ నాయకులు ఆసుపత్రులను పరిశీలిస్తారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడినా.. ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతామని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM