బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే

byసూర్య | Mon, Sep 23, 2024, 10:18 PM

తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో పట్టు సాధించటమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆర్. కృష్ణయ్య బీజేపీలో వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను ఆర్. కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది.


ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు కృష్ణయ్యతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. గతంలో ఆర్. కృష్ణయ్య ఆర్ఆర్ఎస్‌లో పని చేశారు. ఏబీవీపీ నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బీజేపీలో చేర్చుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆఫర్‌కు ఆర్. కృష్ణయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన పార్టీలో చేరుతారని.. కీలక పదవి కూడా దక్కుతుందని కాషాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


కాగా, బీసీ ఉద్యమంతో ఆర్.కృష్ణయ్యకు 5 దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. ఇక 2014లో ఆయన హైదరాబాద్ ఎల్పీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత 2022 నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. తాజాగా.. ఆ పార్టీని కూడా వీడి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22) అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా.. సమావేశంలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని.. తాము తప్పకుండా పార్టీ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 10 మంది వరకు బీసీ నేతలు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేదని.. ఈసారి తాము చాలా పకడ్బందీగా పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇలా ఆర్. కృష్ణయ్య కొత్త పార్టీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీలోకి వెళ్లనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM