byసూర్య | Tue, Jun 18, 2024, 07:27 PM
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కారు.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేయగా.. విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. కమిషన్ విచారణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్.. కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను తోసిపుచ్చిన అధికారులు.. సంచలన విషయాలను బయటపెట్టారు. తెలంగాణకు రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) పీపీఏను కూడా ఆమోదించలేదని అధికారులు కీలక విషయాలు తెలిపారు.
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచరణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్.. కమిషన్ ఛైర్మన్ను స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారు. TSERC ఆమోదించిన తర్వాతే PPA, పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టినట్టు 12 పేజీల లెటర్ను కేసీఆర్ విడుదల చేశారు. అయితే 2017 చివరి నాటికి ఛత్తీస్గఢ్తో పీపీఏ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పటికీ.. 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ మార్కెట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని.. ఫలితంగా 2017 నుంచి 2022 మధ్య కాలంలో రూ.2,083 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు.
"గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిట్కు రూ. 3.90 చొప్పున విద్యుత్ను కొనుగోలు చేసింది. కానీ వాస్తవానికి ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే అది యూనిట్కు రూ. 5.64 అయ్యింది. PPA ఇంక్ చేసిన తర్వాత.. తెలంగాణ 2017, 2022 మధ్య రూ. 7,719 కోట్లకు 17,996 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసింది. ఛత్తీస్గఢ్కు బకాయిలు రూ.1,081 కోట్లుగా ప్రభుత్వం క్లెయిమ్ చేయగా.. విద్యుత్ సరఫరాకు ట్రాన్స్మిషన్ ఛార్జీ రూ.1,362 కోట్లు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్ వ్యయం రూ.5.64కు చేరింది. యూనిట్కు అంగీకరించిన రూ.3.90 ధర కంటే ఇది రూ.3,110 కోట్లు ఎక్కువ." అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.