byసూర్య | Thu, Apr 25, 2024, 07:06 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు ప్రముఖ సంస్థ భారీగా పరిహారం చెల్లించింది. ఏకంగా 2 లక్షల రూపాయలను పరిహారంగా పోలీస్ భాస్ అందుకున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, ఆయన సతీమణి అంజలి గుప్తా కలిసి.. మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. వీళ్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో ప్రయాణించగా.. వాటిలోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ద్వారా ఆటోమేటిక్గా కిందికి వాలుతుండటంతో.. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లే సమయంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఫెయిల్ అవ్వటంతో.. అవి పని చేయలేదని డీజీపీ దంపతులు తెలుసుకున్నారు. ఈ అసౌకర్యంతో డీజీపీ దంపుతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో.. తీవ్ర అసహనానికి లోనైన డీజీపీ రవి గుప్తా.. బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని.. అయినా జర్నీ మొత్తం మేల్కొని ఉండాల్సి వచ్చిందని తమ అసౌకర్యాన్ని ఫిర్యాదు చేశారు. తాము చెల్లించిన టికెట్ ధర.. ఎకానమీ క్లాస్ ధర రూ.18,000 కంటే రూ.48,750 ఎక్కువ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక బిజినెస్ క్లాస్ కోసం డబ్బు చెల్లిస్తే.. తమను ఎకానమీ క్లాస్ ప్రయాణికులుగా పరిగణించారని, అదనపు లెగ్రూమ్ కూడా మినహాయించారంటూ అసహనం వ్యక్తం చేశారు.
డీజీపీ రవి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సింగపూర్ ఎయిర్ లైన్స్.. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ.. ఒక్కో ప్రయాణికునికి 10,000 క్రిస్ ఫ్లైయర్ మైళ్లను ఆఫర్ చేసింది. కానీ.. ఈ అఫర్ను ఫిర్యాదుదారులు తిరస్కరించటంతో.. హైదరాబాద్లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్లైన్స్ని ప్రతి ఫిర్యాదుదారునికి రూ.48,750 చొప్పున మొత్తం రూ.97,500, మే 23, 2023 నుంచి వారు రియలైజ్ అయ్యే వరకు 12 శాతం వడ్డీ చొప్పున వారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. వీటితో పాటు.. ఫిర్యాదుదారుల మానసిక వేదన, శారీరక బాధల కోసం లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని, అలాగే ఫిర్యాదు ఖర్చుల కోసం మరో 10 వేలు చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్కి ఆదేశాలు జారీ చేసింది.