byసూర్య | Sat, May 04, 2024, 09:48 PM
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు రేవంత్ రెడ్డి తేదీలు మారుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు పిచ్చివాడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఈ నాలుగైదు నెలల్లో చిల్లర మాటలు.. ఉద్దెర పనులు తప్ప చేసిందేమీ లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని అన్నారని... ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నాడని విమర్శించారు. ఈ ప్రాంతంలో 3 వేల కోట్ల చీరలకు ఆర్డర్లు ఇచ్చి చేనేత కార్మికుల జీవనోపాధికి కేసీఆర్ ఆసరాగా నిలిచారని, కానీ ఇప్పుడు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నివాళులర్పించకుండా రేవంత్ రెడ్డి అవమానపరిచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాలన్నారు.