byసూర్య | Sat, May 04, 2024, 08:43 PM
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో.. మోత్కుపల్లి నర్సింహులు మాత్రం రెబల్గా మారి సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తనను చంపేసినట్టే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో ప్రసంగించిన మోత్కుపల్లి నర్సింహులు భావోద్వేగానికి లోనయ్యారు.
కాంగ్రెస్కు ఓటేస్తే తనను చంపినట్టే అంటూ ఉద్వోగభరితంగా మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గంలోని నాయకులను ఎందుకు గుర్తించడం లేదంటూ కంటతడిపెట్టారు. అందరూ ఏకమై ఈ ఎన్నికల్లో మాదిగల బలమేంటో కాంగ్రెస్కు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పుట్టకముందే తాను ఎమ్మెల్యేను అని.. రేవంత్ బెదిరింపులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్ను పాతిపెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీల వర్గీకరణ చేయలేకపోయిందంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. ఎంపీ సెగ్మెంట్లతో పాటు, కంటోన్మెంట్లో ఒక్క టికెట్ కూడా మాదిగలకు కేటాయించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్, కడియం శ్రీహరి కుటుంబాలకు కూడా టికెట్లు కేటాయించారంటూ దుయ్యబట్టారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్య ఎంపీ టికెట్ తెచ్చుకునేంతవరకు కూడా ఆమెకు కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని... అలాంటప్పుడు కాంగ్రెస్కు మాదిగలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మాదిగలను కాంగ్రెస్ అవమానపరిచిందని మండిపడ్డారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మాదిగలు, బీసీలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. సీట్ల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ పిలుపునిచ్చారు. మందకృష్ణ ప్రేరణతోనే గ్రూప్-1 ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ వెంకటేష్ తెలిపారు.