byసూర్య | Sat, May 04, 2024, 08:50 PM
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీలు మినిహాయిస్తోంది. అయితే అందుకు ఓ నిబంధన విధించింది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఇది వర్తించనుంది. ప్రస్తుతం సూదూర ప్రాంతాలకు ఎవరైనా ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ఛార్జీలతో పాటు అదనంగా రిజర్వేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులకు భారంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్ ఛార్జీలను మినహాయింపు ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా వెల్లడించారు. 'సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను టీఎస్ఆర్టీసీ మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్సైట్ని సంప్రదించండి.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఇక ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఓ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు వెళ్లే వారికి స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. రాయితీ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.