byసూర్య | Sun, Apr 21, 2024, 09:22 PM
చర్లపల్లి జైలులో ఖైదీ చేసిన పనికి జైలు అధికారులు షాక్కు గురయ్యారు. అతడి చేసిన పనితో ఖంగుతున్నారు. ఆకలేస్తే ఎవరైనా అన్నం తింటారు. మనోడికి ఏం పైత్యం ముదిరిందో ఏకంగా ఇనుప మేకులు మింగాడు. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది మేకులు మింగేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మహ్మద్ షేక్ (32)కు నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు అతడిని గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో జాయిన్ చేశారు.
పరిశీలించిన డాక్టర్లు ఎక్స్రేలు తీయించగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఖైదీ కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు తేలింది. గ్యాస్టో ఎంటరాలజీ హెడ్ శ్రవణ్కుమార్ నేతృత్వంలో శనివారం మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించారు. రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను విజయవంతంగా బయటకు తీశారు. సుమారు 2 -2.5 అంగుళాలు ఉండే ఈ మేకులను రోగి కావాలనే మింగాడని జైలు అధికారులు తెలిపారు. అయితే అందుకు కారణాలేమిటో ఆరా తీస్తున్నామని తెలిపారు.