byసూర్య | Sun, Apr 21, 2024, 09:21 PM
ఆకు కూరల ధరలు ఎలా ఉంటాయో సామాన్యులకు తెలిసిందే. మార్కెట్లో పాలకూర, గోంగూర, తోటకూర ఇలా ఏది తీసుకున్నా పదికి రెండు లేదా మూడు కట్టలు ఇస్తూ ఉంటారు. మహా అయితే.. పదికి ఒక కట్టైనా ఇస్తారు. అంతకు మించిన ధర ఎప్పుడూ ఉండదు. అయితే చింత చిగురు ధర తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఎందుకంటే చింత చిగురు ప్రస్తుతం మటన్ ధరతో పోటీ పడుతుంది. పల్లెల్లో అంతగా పట్టించుకోని చింత చిగురు ప్రస్తుతం సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది. నగర మార్కెట్లలో కేజీ చింత చిగురు రూ.700 పలుకుతోందిం. అంటే.. కేజీ మటన్, రెండు కిలోల చికెన్, మూడు కిలోల చేపలకు సమానంగా కేజీ చింత చిగురు రేటు పలుకుతోంది.
హైదరాబాద్ గుడిమల్కాపూర్ హోల్సేల్, రిటైల్ మార్కెట్తో పాటు రైతుబజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా చింత చిగురు విక్రయిస్తున్నారు. చింత చెట్ల ఆకులు రాలిపోయాక, వచ్చిన చిగురును వంటకాల్లో ఉపయోగిస్తారు. దాంతో చేసిన పప్పు, మాంసం వంటకాలను భోజనప్రియులు చాలా ఇష్టంగా తింటారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్ రిటైల్ మార్కెట్లో కిలో రూ.500- రూ.600 పలుకుతోంది. మెహిదీపట్నం రైతుబజార్లో శనివారం కిలో చింత చిగురు రూ.700 పలికింది. కాగా, బహిరంగ మార్కెట్లో 100 గ్రాములు రూ.100కు అమ్ముతున్నారు. చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి, ప్రాణాలకు తెగించి సేకరిస్తామని రైతులు చెబుతున్నారు. చాలా తక్కువగా దొరుకుతుందని.. అందుకే దీనికి అంత ధర అని అంటున్నారు.
చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయని న్యూట్రిషీయన్లు చెబుతున్నారు. చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయన్నారు. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్–C 3 మి.గ్రా.లు ఉంటుందని చెప్పారు. యాంటీ బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుందని.. యాంటీ డయాబెటిక్ లక్షణాలుండడం వల్ల మధుమేహం ఉన్న వారికి మేలు చేస్తుందని అన్నారు. కాలేయాన్ని రక్షించటంతో పాటు.. జీర్ణ క్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.