byసూర్య | Sun, Apr 21, 2024, 09:17 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత్ రాష్ట్ర సమితి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం గాలివాటమేనని.. క్షేతస్థాయిలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందనే సంకేతాలను ఎంపీ ఎన్నికల్లో విజయం ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు గులాబీ బాస్ కె. చంద్రశేఖర్ రావు. అందులో భాగంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ను బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఏపీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఆ రాష్ట్ర సీఎం జగన్.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరుతో ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. రోడ్షోలు, బహిరంగ సభలతో ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ కూడా ఆయన బాటలోనే రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని టచ్ చేసేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. మే 10న సిద్ధిపేట బహిరంగ సభతో యాత్ర ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి మరి.