byసూర్య | Fri, Mar 01, 2024, 07:17 PM
హైదరాబాద్లో ప్రయాణమంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. బస్సులు ఎక్కుదామంటే.. రద్దీ మామూలుగా ఉండదు. మరి ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్దామంటే.. స్టేషన్ నుంచి గమ్యం చేరటానికి మళ్లీ ఏదో ఒక వాహనం పట్టుకోవాల్సిందే. ఇవన్నీ కాదు క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటే.. ఆ రేట్లు చూస్తేనే సగం నీరసం వచ్చేస్తుంది. ఇక.. బయటి క్యాబ్ మాట్లాడుకుందామంటే బేరాలాడలేక తలలుపట్టుకోవాల్సిందే. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు సౌకర్యంతో పాటు అటు డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా.. "మనయాత్రి" యాప్ను ప్రారంభించారు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా జీరో కమీషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ అయిన మనయాత్రిని గురువారం టీహబ్లో ప్రారంభించారు.
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్ డీసీ)లో భాగమైన మనయాత్రి యాప్ బెంగళూరులో "నమ్మయాత్ర" పేరుతో ప్రారంభమై సక్సెస్ కావటంతో.. అదే స్ఫూర్తితో టీ-హబ్లో దీన్ని రూపొందించి.. ప్రారంభించారు. ఈ యాప్లో క్యాబ్లతో పాటు ఆటో సర్వీసులను కూడా తక్కువ రేట్లకే అందించనున్నారు. హైదరాబాద్ సంసృతి, ఇక్కడి సాంకేతిక నిపుణులకు మనయాత్రి సరిగ్గా సరిపోతుందని ఓఎన్డీసీ సీఈవో టీ కోషి తెలిపారు. ఇది ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగడుతుందని పేర్కొన్నారు. మనయాత్రి అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని.. ఇది హైదరాబాదీ డ్రైవర్లు, నగరవాసుల జీవితాలను మెరుగుపరిచే ఒక ఉద్యమమని జస్ట్ పే సంస్థలో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఎంఎస్ షాన్ తెలిపారు.
మనయాత్రి ఇప్పటికే హైదరాబాద్లో 25వేల మందికి పైగా డ్రైవర్లను నియమించుకుందని నిర్వాహకులు తెలిపారు. మరో లక్ష మందిని రాబోయే 3 నెలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొందని వెల్లడించారు. హైదరాబాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసేందుకు టీ-హబ్తో కలిసి పనిచేస్తున్నట్టు యాప్ నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://nammayatri.in/ ను సంప్రదించాలని నిర్వహకులు పేర్కొన్నారు.