byసూర్య | Fri, Mar 01, 2024, 07:14 PM
లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ రెడ్డి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్కుంటాడని.. కోమటిరెడ్డి తర్వాత అదే కుర్చీని లాక్కునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడంటూ విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రలో.. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఖజానా ఖాళీగా ఉందంటూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రైతుబంధు కోసం మాజీ సీఎం కేసీఆర్ 7000 కోట్ల రూపాయలు డబ్బులు ఉంచిపోతే.. అందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 2000 కోట్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ. 3000 కోట్లు తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుమారు రూ. 300 కోట్లు ఖర్చు పెడితే.. అధికారంలోకి వచ్చాక.. 3000 కోట్లు తీసుకుపోయారంటూ ఆరోపించారు.
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒక్కటే అని.. ఇద్దరూ కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 14 సీట్లకుపైగానే ఎంపీ సీట్లు గెలుచుకుంటామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.