byసూర్య | Fri, Mar 01, 2024, 07:10 PM
రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. అయితే.. ఈ కేసులో రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తుండటంతో.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో.. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో కలిపి.. నిందితుల సంఖ్య 14కు చేరింది. అయితే.. ఈ కేసులో మరో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితులకు.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు లింకులు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ కేసులో సినీ నిర్మాత కేదార్ పట్టుబడగా ఆయనతో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు.. చాలా రోజులుగా వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. కేదార్ బిజినెస్ పార్ట్నర్కు చెందిన రేంజ్ రోవర్ కారును రాజ్ పాకాల వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో కలకలం రేపుతోన్న ఈ డ్రగ్స్ కేసు.. ప్రస్తుతం కేటీఆర్ బావమరిది పేరు కూడా తెరపైకి రావటంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులతో కేటీఆర్ బావమరిది సన్నిహింతంగా ఉన్నారన్న వార్తలు ప్రచారంలోకి రావటంతో.. అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. దీంతో.. ఈ కేసు ఎటు వెళ్తుందో అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే.. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల క్రితమే ప్రతిపక్ష నాయకుడిగా తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజ్ పాకాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని, ఆయన ఏం చేసినా అరడిగేవారే లేరని విమర్శలు చేశారు. 'ఈవెంట్స్ నౌ' అనే డేటింగ్ సంస్థ పేరుతో గచ్చిబౌలిలో పార్టీలు నిర్వహిస్తూ యువతీ, యువకులకు డేటింగ్ ఏర్పాట్లు చేసేవారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల.. డేటింగ్ కోసం సంస్థను పెడితే చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
అయితే.. రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేదార్కు రాజ్ పాకాలకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కేదార్ను బినామీగా రాజ్ పాకాలనే పెంచి పోషించారని.. ఆయన వ్యాపారాలన్నింటికి రాజ్ పాకాలానే అండగా నిలిచారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఆరు నుంచి పది మంది సిని పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఇందులో అనుమానితులుగా ఉండటం.. ఇప్పుడు కేటీఆర్ బావమరిది పేరు తెరపైకి రావటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కేసులో తీగ లాగితే ఇంకెవరెవరి డొంకలు కదిలే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.