byసూర్య | Fri, Mar 01, 2024, 07:21 PM
ప్రస్తుతం మార్కెట్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉన్న కాంపిటీషన్ అంతా ఇంతా కాదు. పదేళ్లుగా గడ్డాలు మీసాలు పెంచుకుని.. సరదాలు సంతోషాలు పక్కనబెట్టి.. రుషుల్లాగా తపస్సులు చేస్తున్నారు నిరుద్యోగ యువత. అయితే.. కారణాలేవైనా నోటిఫికేషన్లు పడకో.. పడినా పరీక్షల వరకు రాకనో.. ఇప్పటికీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అలుపెరుగని యోధుల్లా పోరాడుతూనే ఉన్నారు. అయితే.. తమ కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల వల్ల సంవత్సరాల తరబడి ప్రిపరేషన్కే పూర్తి సమయం కేటాయించటం సాధ్యం కాకపోవటంతో.. కొంత మంది యువకుడు పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూనే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అటు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ.. మిగిలిన సమయంలో ప్రిపేర్ అవుతూ.. పడిన పరీక్షలన్నింటినీ రాసుకుంటూ.. తమకంటూ ఓ రోజు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అలా.. ఎదురు చూస్తున్న యువకులకు తమదైన రోజు వచ్చింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం తలపుతట్టింది. అది కూడా తమకు మాత్రమే వినిపించేలా కాదు.. చుట్టూ ఉన్న సమాజానికి కూడా వినిపించేంత గట్టిగా విజయం తలుపుతట్టింది. ఒక్క ఉద్యోగం వస్తే చాలు అని ఆశగా ఎదురుచూస్తే.. ఒకేసారి ఏకంగా మూడు, నాలుగు.. కొందరికైతే ఐదు ఉద్యోగాలకు ఎంపికకావటం విశేషం. అలా.. ఫుడ్ డెలివరీ బాయ్గా పార్ట్ టైం చేస్తూ.. ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు అనే యువకుడు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కు వచ్చాడు. అయితే.. తమ కుటుంబ పరిస్థితుల వల్ల.. పూర్తిగా ప్రిపరేషన్కే అంకితం కాకుండా.. పార్ట్ టైం జాబ్ చేస్తూ.. తన ఖర్చులకు కావాల్సిన డబ్బును సంపాధించుకోవటంతో పాటు ఇంట్లో వాళ్లకు కూడా సాయంగా నిలుస్తున్నాడు. అటు జాబ్ చేస్తూనే.. మిగితా సమయంలో ప్రిపరేషన్ కొనసాగిస్తూ పరీక్షలు రాయగా.. ఇప్పుడు TGT, PGT, JL ఇలా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తాచాటాడు. ఇక మావల్ల కాదు.. ఎంత చదివిన ఉద్యోగాలు రావట్లేదు.. ప్రభుత్వాలు నోటిఫికేషన్లు వేయట్లేదు.. అంటూ నిరుత్సాహపడేవారికి బల్వంత్ రావు ఓ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఓయూలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న ఓ యువకుడు కూడా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవటం స్పూర్తిదాయకం. మంచిర్యాల జిల్లాకు చెందిన గొల్లె ప్రవీణ్ అనే యువకుడు.. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రిసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో నైట్ వాచ్మన్గా విధులు నిర్వహిస్తూనే.. పగటి పూట పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. పరీక్షల్లో సత్తా చాటి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ప్రవీణ్ కూడా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికవటం గమనార్హం.