byసూర్య | Fri, Mar 01, 2024, 07:25 PM
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. నిమిషం నిబంధనల వల్ల కొంత మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రానికి ముందుగా వెళ్లాలన్న తొందరలో.. పలువురు విద్యార్థులు బైకుల మీద వెళ్తూ ప్రమాదానికి గురవుతున్నారు. ఈరోజు (మార్చి 1న) కూడా ఓ విద్యార్థిని పరీక్షకు వెళ్తూ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయమవగా.. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు మానవత్వాన్ని చాటుకున్నాడు. అయితే.. తలకు అయిన తీవ్ర గాయంతోనే విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్లటం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు నగరానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. అయితే.. సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బండి అదుపుతప్పడంతో వాళ్లు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉపాశంకర్.. ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించారు. ఆ విద్యార్థినిని తన వాహనంలోనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే ముందే.. ఆ విద్యార్థిని వెళ్లాల్సిన పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్కు ప్రమాద సమాచారం అందించి.. అనుమతి తీసుకున్నారు.
కాగా.. విద్యార్థిని తలకు బలమైన గాయం కావటంతో.. ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినిని మళ్లీ తన వాహనంలోనే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపాశంకర్. అది కూడా సరైన సమయానికే. ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చేసిన సాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. అంత బలమైన గాయం తగిలినా.. నొప్పితోనే పరీక్ష రాసేందుకు వెళ్లింది విద్యార్థిని.