byసూర్య | Fri, Jan 15, 2021, 02:11 PM
కోడి పందాలు కొనసాగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు కోడి పందాల స్థావరాలపై దాడులు చేసి 7 గురు వ్యక్తులను అరెస్టు చేశారు.ఈ ఘటన పై ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో ఉత్తరం దిక్కు ఉన్న ఓపెన్ ప్లేస్లో కోడి పందాలు కొనసాగుతున్నాయని, కూకట్పల్లి డివిజన్ ఏసీపీకి సమాచారం అందింది. దీంతో పోలీసులు పందాలు కొనసాగుతున్న స్థావరంపై ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు వారిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు.
ఈ దాడుల్లో గరివెల్లి జీవన్ కుమార్ (49), ఎల్లబోయిన త్రిమూర్తులు, వల్లభనేని రమేష్ (52), కందేటి సీతారాం (21), మల్లేష్ (24), ఆశిష్ కుమార్, ఉమా మహేశ్వర్ రావు (42) అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కోడి పుంజులు, 8 ఫోన్లు, రూ.25,500 నగదు, టీఎస్10ఇజి0875 అనే నంబరు గల ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.