byసూర్య | Sat, Aug 17, 2019, 09:35 PM
హైదరాబాదీ దంపతులు పర్యవరణాన్ని కాపాడటమే కాకుండా తక్కువ ధరకే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చేస్తున్నారు. వాడేసిన ప్లాస్టిక్ పదార్థాలతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఫర్నీచర్తో పాటు ఇళ్ల గోడలు, టైల్స్ వంటివి కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్తో తయారుచేస్తున్నారు. గృహ నిర్మాణంలో పదేళ్ల అనుభవం ఉన్న ప్రశాంతం లింగం, అరుణ దంపతులు ఈ కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు.
ప్రశాంత్ మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రోజురోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్ పదార్థాల వినియోగం మాకు ఈ ఆలోచన వచ్చేలా చేసింది. పాల ప్యాకెట్లలో ఉండే ప్లాస్టిక్తో ఫర్నీచర్, టాయిలెట్స్, బెంచ్, బస్ షెల్టర్ నిర్మాణాలు చేపడుతున్నాం' అని తెలియజేశారు. లింగం తొలి సారి ఉప్పల్ ప్రాంతంలో ప్లాస్టిక్తో 800చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికి 7టన్నుల ప్లాస్టిక్ వాడారు.
'అంత ప్లాస్టిక్ను మట్టిలో కలిసి కాలుష్యం కాకుండా కాపాడగలిగాం. చాలా మంది ప్లాస్టిక్ ఇల్లు అనగానే భయపడిపోతారు. కానీ, ఆందోళన చెందాల్సిందేమీ లేదు. ఇటుకలతో కట్టిన ఇంటిలాగే బలంగానే ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణం చేసేందుకు రూ.40లక్షలు ఖర్చు అవుతుందంటే ఈ ప్లాస్టిక్ ఇల్లు కట్టేందుకు చదరపు అడుగుకు రూ.700మాత్రమే ఖర్చు అవుతుంది. పైగా ఈ ఇంటికి వాటర్, ఫైర్, హీట్ రెసిస్టెన్సీ కూడా ఉంటుంది' అని ప్రశాంత్ తెలియజేశారు.
వీటితో పాటుగా30నుంచి 40ఏళ్ల వరకూ చెక్కు చెదరకుండా ఉంటుందనే నమ్మకాన్ని కూడా ఇస్తున్నారు. కొన్ని స్కూళ్ల నుంచి బెంచ్లు తయారుచేయాలంటూ ఆర్డర్లు కూడా వస్తున్నాయట. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడి చేసిన ప్రసంగంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేదించాలంటూ పిలుపునిచ్చారు. అంటే తప్పని పరిస్థితుల్లో మినహాయించి కొత్త ప్లాస్టిక్ పదార్థాలు వాడకూడదు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్నే వాడాలట.