byసూర్య | Sat, Oct 19, 2024, 03:43 PM
ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లిలోని మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ డివిజన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ సబ్ డివిజన్ కార్యాలయాలను సైతం కలెక్టర్ తనిఖీ చేశారు. మిషన్ భగీరథ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
త్రాగునీటి నాణ్యతను పరీక్షించే జిల్లా లాబరేటరీ పరిశీలించిన కలెక్టర్ నీటి నాణ్యత పరీక్షల రికార్డులను చెక్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నాణ్యత పరీక్షలు పక్కాగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి అంశంలో ఎటువంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.ఈ తనిఖీలలో మిషన్ భగీరథ ఈఈ ఇంట్రా గంగాధర శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.