byసూర్య | Tue, Jun 25, 2024, 08:25 PM
హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే.. మెట్రో ప్రయాణాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవారు మెట్రో ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో మెట్రో సంస్థకు ఆదాయం కూడా పెరుగుతోంది. తాజాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైలు సంస్థ ఆదాయన్ని అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం 105 శాతం పెరగినట్లు అధికారులు తెలిపారు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో రూ.1407.81 కోట్ల రాబడి వచ్చిందన్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇది రూ.703.20 కోట్లు అని ఎల్అండ్టీ అధికారులు స్పష్టం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం డబుల్ అయింది. టికెట్ల అమ్మకం ద్వారానే సంస్థకు రూ.611.48 కోట్ల ఆదాయం వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఆధారిత అభివృద్ధి నుంచి రూ.796.33 కోట్ల ఆదాయం వచ్చింది. టీవోడీలో మాల్స్, ఆఫీస్ రెంట్లు, టెలికాం టవర్లు, అడ్వటైజ్మెంట్ల ద్వారా రూ.284.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని ల్యాండ్ను స్లంప్ సేల్ రూపంలో బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్, రహేజా గ్రూప్నకు బదిలీ చేయడం ద్వారా తొలివిడతలో రూ.511.73 కోట్ల ఆదాయం వచ్చింది.
గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరిగినా.. ఓవరాల్గా చూస్తే మాత్రం మెట్రో సంస్థ నష్టాల్లోనే ఉంది. గతేడాది మెట్రో నిర్వహణకు రూ.1962.85 కోట్లు ఖర్చయ్యాయి. రాబడి ఆదాయం 1407.81 పోగా.. ఒక్క ఏడాదే రూ.555.04 కోట్ల నష్టాలు వచ్చాయి. మెుత్తం మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయని ఎల్అండ్టీ మెట్రో అధికారులు ప్రకటించారు.