byసూర్య | Tue, Jun 25, 2024, 08:28 PM
ఉప్పల్- నారపల్లి (ఘట్కేసర్) ఫ్లై ఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆ నిర్మాణానికి కేటాయించిన కాంట్రాక్ట్ను రద్దు చేయాలని డిసైడ్ అయింది. దీంతో పాటు కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ మంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాకు వెల్లడించారు.
సోమవారం (జూన్ 24) ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన కోమటిరెడ్డి వివిధ పనులపై కేంద్రమంత్రి గడ్కరీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉప్పల్ ఫ్లై ఓవర్ విషయంపై కూడా చర్చించగా.. పాత కాంట్రాక్టులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలను గడ్కరీ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ రింగు రోడ్డు కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడరీ హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.
కాగా, హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. మెుత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.600 కోట్లతో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
టెండర్లు ప్రక్రియలో భాగంగా గాయత్రి అనే సంస్థ పనులను దక్కించుకుంది. నిబంధనల ప్రకారం 2020 జులైలో ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే మధ్యలో కాంట్రాక్ట్ సంస్థ దివాలా తీయటంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు ఏళ్లుగా అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ కారిడార్లో నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. వారికి కష్టాలు మెుదలయ్యాయి. తాజాగా.. కేంద్ర మంత్రి కీలక ప్రకటనతో త్వరలోనే ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తయితే యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.