ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి.. వీటిని ఎప్పుడు, ఎవరు రిలీజ్ చేస్తారు.. రూల్స్ ఏంటి

byసూర్య | Fri, May 31, 2024, 07:33 PM

దేశంలో 44 రోజుల పాటు జరుగుతున్న ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు శనివారంతో పూర్తి కానున్నాయి. దేశంలోని 543 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఫలితాలు జూన్ 2 వ తేదీన వెలువడనుండగా.. మిగిలిన ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీలతోపాటు అన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి తిరిగి అధికారంలోకి వస్తుందా లేక దాదాపు 30 ప్రతిపక్ష పార్టీలు కలిపి ఏర్పాటైన ఇండియా కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే కొంతవరకు ఫలితాలపై అంచనా రానుంది.


ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి?


ఏవైనా ఎన్నికలు జరిగిన తర్వాత.. ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించడానికి ముందు కొన్ని మీడియా సంస్థలు, ఇతర సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను అన్ని విడతల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల తొలి విడత ప్రారంభమైన ఏప్రిల్ 19 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి విడత జరిగే జూన్ 1 వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 126 ఏ ప్రకారం ఈ నిబంధన ఉంటుంది. ఆ లోపు ఏ వ్యక్తి గానీ, సంస్థలు గానీ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సహా ఎలాంటి మాధ్యమాల ద్వారా విడుదల చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉంటాయి. ఒక వేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే అందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరిమానాలు, లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలు ఉంటాయి. దీంతో జూన్ 1 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.


ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?


ఎన్నికల పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అంచనా వేస్తాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటివి పేర్కొంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు.. ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తారు అనే విషయాలను కూడా వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించేందుకు కొన్ని రోజుల ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతాయి. పోలింగ్ పూర్తి అయిన తర్వాత సర్వే ఏజెన్సీలు.. ఓటర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆధారపడి ఉంటుంది.


2019, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది?


2019 లోక్‌సభ ఎన్నికల్లో పలు సంస్థలు ఎన్డీఏ కూటమికి 285 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఏకంగా 353 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఒక్క బీజేపీనే సొంతగా 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 91 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక 2014 లో ఎన్డీఏ కూటమికి 257 నుంచి 340 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. 336 స్థానాలు సాధించింది.


అయికే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఫైనల్ ఫలితాలు దాదాపు సమానంగా ఉంటున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. మన భారత దేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20 వేల నుంచి 30 వేల మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకుని సర్వే చేసేవారని ఢిల్లీలోని సోషల్ సైన్సెన్ అండ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్-సీఎస్‌డీఎస్‌కు చెందిన సంజయ్ కుమార్ వెల్లడించారు. దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.. పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. ఇక 1996 లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్‌ నిర్వహించేందుకు.. ప్రభుత్వ ప్రసార ప్రసార సంస్థ దూరదర్శన్.. సీఎస్‌డీఎస్‌ను నియమించింది. ఆ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువరుస్తున్నాయి.



Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM