హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం

byసూర్య | Sun, Oct 20, 2024, 11:31 PM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (అక్టోబర్ 20న) రాత్రి.. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో.. వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఇలా.. కాన్వాయ్‌లోని 3 వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు ఎలాంటి ప్రమాదం కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు గానూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో.. ప్రధాన రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా.. వాహనాల్లో ఉన్న వ్యక్తులకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


అయితే.. ఏటా జరిపినట్టుగానే ఈసారి దసరా పండుగకు హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అట్టహాసంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ప్రస్తుతం దత్తాత్రేయ.. గవర్నర్‌గా ఉండటంతో.. ఈ కార్యక్రమ బాధ్యతలను ఆయన తనయ విజయలక్ష్మి చూసుకుంటున్నారు. అయితే.. ఈసారి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బండారు దత్తాత్రేయ.. తిరిగి ఈరోజే వెళ్తున్న క్రమంలోనే.. ఈ ప్రమాదం సంభవించింది.


కాగా.. ఇటీవల నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో.. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అలయ్ బలయ్‌కి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ఐకమత్యంతో పనిచేయాలని.. రెండు రాష్ట్రాలను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉంచాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆకాంక్షించారు. తాను హర్యానాకు గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డనే అని పేర్కొన్నారు. అలయ్ బలయ్‌కి వస్తానని ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో ఎదిగారని దత్తాత్రేయ కొనియాడారు. జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థానానికి వచ్చారని దత్తాత్రేయ కొనియాడారు.



Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM