మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు

byసూర్య | Sun, Oct 20, 2024, 11:34 PM

హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూ కిలోమీటర్ల మేర నివాసాలు ఏర్పాడ్డాయి. అయితే ఓ ప్రాంతంలో మాత్రం భూములు ఖాళీగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు అదే ఆ ప్రాంతానికి సానుకూలంగా మారింది. పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మిస్తున్నారు. చాలా కంపెనీల ప్రాజెక్టులు వేరు వేరు దశల్లో ఉన్నాయి. కొత్తగా విమానాశ్రయ మెట్రో మార్గాన్ని ఈ ప్రాంతం మీదుగా ప్రభుత్వం ప్రకటించడంతో అందరి దృష్టి ఇటు మళ్లింది. గృహాలకు సరికొత్త మైక్రో మార్కెట్‌గా నిలిచింది. అదే ఆరాంఘర్ నుంచి శంషాబాద్ మార్గం.


బెంగళూరు నేషనల్ హైవే, అతి చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఐటీ కారిడార్‌కు వేగంగా చేరుకునే వీలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేతో నగరంలోకి త్వరగా చేరుకునే అవకాశం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్లేందుకు శివరాంపల్లి, బుద్వేల్ ఎంఎంటీఎస్ స్టేషన్లు, సమీపంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి రవాణా సౌకర్యాలతో ఈ ప్రాంతానికి చాలా సానుకూలతలు ఉన్నాయి. ఆరాంఘర్ నుంచి సిటీకి చేరుకునేందుకు ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నా.. ఇప్పుడు చాలా వరకు ఫ్లైఓవర్లు నిర్మించారు. జూపార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయి. రాజేంద్రనగర్ వద్ద హైకోర్టు కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఇప్పుడు మెట్రో రైలు సైతం ఆరాంఘర్, గగన్‌పహాడ్, సిద్ధాంతి, శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరంలో అతిపెద్ద మాల్ రానుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ ప్రాంతంపై పడింది.


 ఈ ప్రాంతానికి సమీపంలోని పేరున్న స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ముందు ముందు పెద్ద పెద్ద హాస్పిటల్స్ సైతం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. జాతీయ రహదారికి చుట్టు పక్కల పెద్ద ఎత్తున కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. నగరం నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు. ఖాళీ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి నివాసానికి సిద్ధంగా ఉన్నాయి. విమానాశ్రయంలో పని చేసే ఉద్యోగులు, బేగంబజార్ వంటి ప్రాంతల్లో వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, మహబూబ్‌నగర్, రాయలసీమ ప్రజలు ఇళ్ల కొనుగోలుకు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నట్లు రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.


హైదరాబాద్ మెట్రోతో దక్షిణ ప్రాంతంలో రియాల్టీకి డిమాండ్ పెరగడం కాయమని స్థిరాస్తి రంగ వ్యాపారలు చెబుతున్నారు. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఐటీ కారిడార్ ఉన్న పశ్చిమ ప్రాంతం ఆదిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ తర్వాత తూర్పులో ఇటీవల డిమాండ్ పెరిగింది. ఉత్తరం వైపు సైతం మంచి ఆదరణ లభిస్తోంది. ఇక శంషాబాద్ ఉన్న దక్షిణం వైపే ఇప్పటి వరకు పెద్దగా గృహాల నిర్మాణం జరగలేదు. పారిశ్రామిక ప్రాంతం కావడం, జీవో 111 వంటి ఆంక్షల వంటి కారణాలు ఉన్నాయి. మెట్రో నిర్మాణం పూర్తయితే దక్షిణ ప్రాంతం రూపు రేఖలు మారుతాయని, జనావాసాలు విస్తరిస్తాయని రియాల్టీ వర్గాలు భావిస్తున్నాయి.



Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM