byసూర్య | Fri, May 31, 2024, 07:30 PM
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) భారీ విరాళం అందింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని.. అనంతరం హుండీలలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంతమంది భక్తులు టీటీడీకి విరాళం అందించి.. శ్రీవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. తాజాగా టీటీడీకి భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం టీటీడీకి ఏకంగా కోటిన్నర రూపాయలను విరాళంగా అందించింది. హైదరాబాద్కు చెందిన వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ అనే భక్తులు రూ.1.5 కోట్లను ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు విరాళంగా అందజేశారు. తమ కంపెనీ అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీసి.. డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
మరోవైపు శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా.. ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. కిడ్నీ, గుండె , బ్రెయిన్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది. నిరుపేదలకు ఈ వైద్యచికిత్సలను భరించడం చాలా కష్టం కావటంతో శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా వారికి ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్, బర్డ్, ఎస్వీఆర్ఆర్, మెటర్నిటీ ఆస్పత్రుల్లో వీరికి ఉచితంగా చికిత్స అందిస్తారు. ఈ ట్రస్టు సేవలకు మెచ్చి హైదరాబాద్ కుటుంబం కూడా తమ వంతుగా కోటిన్నర రూపాయలను విరాళంగా అందజేసింది.
జూన్ ఒకటి నుంచి ఐదురోజులపాటు హనుమజ్జయంతి వేడుకలు
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఐదురోజులూ..ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి, అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. అలాగే జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే నాద నీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం హనుమన్ జననం సహా హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.