byసూర్య | Mon, May 27, 2024, 10:20 PM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించున్నారు. ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ వేడుకల్లో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ ఒకటో తేదీ గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్దగల అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ ప్రారంభం కానుంది. కొవ్వొత్తుల ర్యాలీ అమరజ్యోతి వద్దకు చేరుకోగానే.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పిస్తారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన జూన్ రెండో తేదీన దశాబ్ది ముగింపు వేడుకల సభ నిర్వహిస్తారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ జరగనుంది. అలాగే హైదరాబాద్లోని పలు ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేస్తారు. ఆఖరిదైన జూన్ మూడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. అలాగే ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు పంచిపెట్టనున్నారు.
పదేళ్లపాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామన్న కేసీఆర్.. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నేతలను కోరారు.