అమ్మతనం కోసం ఆరాటం.. ఆ చిలుకూరి బాలాజీయే ఉక్కిరిబిక్కిరి

byసూర్య | Fri, Apr 19, 2024, 07:18 PM

'అమ్మా..' అనే పిలుపు మహిళల జీవితంలో ఎంతో అమూల్యమైనది. అమ్మతనంతోనే తమ జీవితం పరిపూర్ణవుతుందని ఎంతో మంది మహిళలు నమ్ముతారు. ఒక మహిళ తన జీవితం ఎన్ని పాత్రలు పోషించినా.. తల్లి పాత్ర అన్నింటికంటే గొప్పదని చెప్తుంటారు. అయితే.. ప్రస్తుతమున్న సమాజంలో.. అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. ఈ రోజుల్లో.. సంతాన లేమి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. పెళ్లైన ఎన్నో జంటలు సంతానం కోసం ఏళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనపడిన దేవున్నళ్లా మొక్కటం.. వినిపించిన ప్రతి డాక్టర్‌ను వెళ్లి కలవటం.. చేపించుకొమ్మన్న ట్రీట్మెంట్లన్నీ చేపించుకోవటం.. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చాలా మంది దంపతులు.. పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినా సంతానం లేక దిగులు చెందుతూ.. మానసికంగా కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.


వైఫల్యానికి అసలు కారణమిదే..!


ఈ సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి.. ఈరోజు జరిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో గురుడ ప్రసాద పంపిణీ కార్యక్రమమే పెద్ద ఉదాహరణ. ఏప్రిల్ నెల మొదట్లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్.. మీడియా వేదికగా ఓ పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఏప్రిల్ 19న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని.. ఆ రోజు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించనున్నట్టు వివరించారు. ఆ నైవేద్యాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వితరణ చేస్తామని.. ఆ ప్రసాదం కోసం ఏప్రిల్ 19న ఉదయం 8 గంటల వరకు ఆలయానికి రావాలని చెప్పారు. ఎన్ని వందల మంది వచ్చినా.. ప్రతి ఒక్కరికీ ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తామని రంగరాజన్ చెప్పుకొచ్చారు.


సంతానలేమి సమస్య ఈ స్థాయిలో


అయితే.. రంగరాజన్ ఇచ్చిన బైట్ మీడియా ఛానల్స్‌లో ప్రసారం కాగా.. అందుకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ రూపంలో తెగ వైరల్ అయ్యింది. ఒక మహిళకు తెలిసిన ఈ విషయాన్ని.. తన పరిధిలో సంతానలేమితో ఉన్న మహిళందరికీ షేర్ చేయటం.. తమ బంధువులను కూడా ఓసారి వెళ్లిరండి అంటూ సూచించటంతో.. ఈ గరుడ ప్రసాద వితరణ కార్యక్రమం జనాల్లోకి పెద్ద ఎత్తున చేరింది. కట్ చేస్తే.. ఈరోజు చిలుకూరు బాలజీ ఆలయం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. ఇసుకెస్తే రాలనంత జనం ఆలయానికి వచ్చారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు.. కేవలం హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జంటలు.. వారితో పాటు ఏపీ, కర్ణాటక నుంచి చాలా జంటలు రావటం గమనార్హం. కొందరైతే.. ముందు రోజే వచ్చి అక్కడే నిద్రించి వేకువజామునే రెడీ అయ్యి.. లైన్‌లో నిల్చున్నారంటే.. సంతానం కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.


సుమారు 2 లక్షల మంది భక్తులు..!


ప్రసాదం కోసం ఎంత మంది వచ్చారన్నది సంఖ్యల్లో చెప్పటం కొంచెం కష్టమే కానీ.. ఆలయానికి వచ్చిన భక్తుల వాహనాలతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా.. ఆలయం నుంచి మొదలుకుని హిమయత్‌నగర్ గ్రామం వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు ఇంకెన్నో. అయితే.. సుమారుగా ఒకటిన్నర నుంచి 2 లక్షల మంది వరకు భక్తులు వచ్చినట్టుగా భక్తులు నోటి లెక్కలు వేసుకుంటున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం గరుడ ప్రసాదం ఆరగిస్తే.. స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్మి వచ్చిన.. జంటలే ఇన్ని ఉంటే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఇంకా ఎంత మంది ఉంటారన్నది తలుచుకుంటే.. మనసు కకావికలమవుతోంది.


అడుగడుగునా సౌకర్యాల లేమి..


ఇదంతా ఇలా ఉంటే.. ఆలయ అర్చకులు పిలుపునిచ్చారు సరే.. కానీ ఇంత మంది వస్తారని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే.. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ గరుడప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు. కానీ.. ఇలా ఇసుకేస్తే రాలనంత జనం రావటం ఎప్పుడూ జరగలేదు. మహా అయితే.. 10 వేల నుంచి 15 వరకు వస్తారని అంచనా వేసుకుని ఉంటారు. అందుకే.. పెద్దగా జాగ్రత్తలు కానీ.. సౌకర్యాల కల్పన కానీ చేయలేదు. ఆ విషయం అక్కడ.. అడుగడుగా బోదపడుతోంది. వాళ్లు ఊహించలేకపోవటానికి మూల్యం భక్తులే చెల్లించుకోవాల్సి వచ్చిందనుకోండి.


 తొక్కిసలాటలో మహిళలు..


అయితే.. అర్చకులు చెప్పినట్టుగా 8 గంటల వరకు ఉండాలని చెప్తే.. చుక్క పొద్దుతోనే జంటలు వచ్చి అక్కడ బారులు తీరటం పరిస్థితికి అద్దం పట్టింది. కాగా.. తొలుత ఆలయానికి వచ్చిన దంపతులంతా ప్రసాదం కోసం వేచి ఉన్నారు. వచ్చిన భక్తుల సంఖ్యను చూసి.. ఆలయ సిబ్బందికి ఏమనిపించిందో కానీ.. కేవలం ఆడవారిని మాత్రమే లోపలికి పంపిస్తామని.. మగవారంతా బయటవేచి ఉండాలని తెలిపారు. దీంతో.. భార్యలను లైన్‌లో వదిలి భర్తలు బయట వేచి చూస్తూ ఉండిపోయారు. అయితే.. పెద్ద ఎత్తున మహిళలు వస్తుండటంతో.. నిర్వాహణ లోపమో లేదా అంతమంది వస్తారని ఊహించకపోవటమో కానీ.. స్వామి వారి దర్శనం సమయంలో భక్తుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఆ తొక్కిసలాటలో చాలా మంది మహిళలు కింద పడిపోయి నలిగిపోయారు. చాల మంది మహిళలు ఊహిరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళపై సుమారు పది మంది పడిపోవటంతో కాలు విరిగినట్టు సమాచారం.


ప్రసాదం తీసుకోకుండానే వెనక్కి..


ఇక.. దర్శనమై ప్రసాదం కోసం కూడా మూడు ద్వారాల గుండా పంపించటంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువైపోయి.. అక్కడ కూడా అదే సీన్ రిపీటైంది. చాలా మంది మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అన్ని గంటలు లైన్‌లో కష్టాన్ని ఓర్చుకుని నిల్చున్నా.. చివరికి ప్రసాదం ఇచ్చే సమయానికి తట్టుకోలేక బోరున ఓడుస్తూ చాలా మంది మహిళలు బయటికి వచ్చారు. కాగా.. మిగతా వారందరికీ ప్రసాదం దొరికినా.. వాళ్లకు కూడా కన్నీళ్లు తప్పలేదు.


నెట్‌వర్క్ లేకపోవటం పెద్ద ఇబ్బంది..


భార్యలు లోపలికి వెళ్లేప్పుడు వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇచ్చి పంపించగా.. దర్శనం పూర్తయ్యాక ఫోన్ చేస్తారులే అన్న దీమాలో భర్తలు ఉన్నారు. కానీ.. అసలు విషయమేమిటంటే.. సుమారు ఏడున్నర సమయం నుంచి చిలుకూరు ఆలయ పరిధిలో సుమారు రెండు కిలోమీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ మొత్తం జామ్ అయిపోయాయి. దీంతో.. కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా.. భర్త ఎక్కడ ఉన్నాడో భార్యకు తెలియక.. భార్య ఎప్పుడు వస్తుందో తెలియక భర్త తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆలయంలో నుంచి ఒకటే ఎగ్జిట్ ఉండగా.. అక్కడే భర్తలంతా పోగవటంతో.. తమవారిని గుర్తించటం అటు భార్యలకు, భర్తలకు అగ్నిపరీక్షగా మారింది.


తప్పిపోయి కన్నీళ్లు..


పైనుంచి ఎండ.. ఒళ్లంతా చెమటలు పోస్తున్నా తమ వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేక తప్పిపోయారు. దీంతో.. కన్నీళ్లు పెట్టుకుంటూ మహిళలు అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూం వద్దకు వెళ్లగా.. అప్పుడు తేరుకున్న పోలీస్ సిబ్బంది.. స్పందించి మిస్సింగ్ ప్రకటనలు చేయటం ప్రారంభించారు. తమవారి కోసం అప్పటివరకు తీవ్రంగా శ్రమించగా.. మొదటి ప్రకటన విన్న భక్తులు కంట్రోల్ రూంకు పరుగులు తీశారు. అప్పటికీ చాలా మంది గంటల తరబడి కలుసుకోలే చాలా ఇబ్బంది పడటం.. బాధను కలిగించింది.


మాటే బంగారమాయే గోవిందా..


మరోవైపు.. ఈ మొత్తం కృత్యంలో ఆలయ సిబ్బంది మొదటి నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్లు కానీ.. భక్తులకు సూచనలు కానీ చేయకపోవటం గమనార్హం. ప్రసాదం కోసం ఎక్కడికి వెళ్లాలి.. దర్శనం కోసం ఎటు నుంచి వెళ్లాలి.. భక్తులు ఓపికగా ఉండండి అందరికీ ప్రసాదం అందుతుంది అని గానీ.. తోసుకోవద్దని చెప్పటం కానీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవటం అక్కడున్న భక్తులను ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రసాదం తీసుకునేవారు.. ఉపవాసంతో ఉండాలని చెప్పటంతో.. మహిళలంతా ఏమీ తినకుండా వచ్చారు. కాగా ప్రసాదం అందుకునే సమయానికి వాళ్లు చేసి సాహసానికి తోడు ఎండ తీవ్రత, ఉక్కపోతతో.. శరీరంలో సత్తువలేక చాలా మంది స్పృహలు కోల్పోయారు. కాగా.. లోపల క్యూలైన్లు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవటంతో.. నీళ్లు అందించే సౌకర్యం కూడా లేదు. ఇది కూడా మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురిచేసింది.


కనీసం నీళ్లు కూడా లేవు..


బయటికి వచ్చిన వాళ్లు ప్రసాదాన్ని ఆరగించి.. ఏమైనా ఎంగిలి పడదామంటే టిఫిన్ సెంటర్లలో టిఫిన్లు నిండుకున్నాయి. అలా కాదు.. ఏదైనా జ్యూస్ కానీ, కూల్ డ్రింక్ కానీ తాగి చల్లబడదామంటే అవి కూడా నిండుకోవటం గమనార్హం. పోనీ నీళ్లయినా తాగుతామంటే.. వాటర్ బాటిళ్లు కూడా అయిపోయి.. ఏమి చేయాలో తెలియని దుర్భర పరిస్థితి నెలకొంది. ఓ భక్తుడైతే.. దేవుడి కోసం 50 రూపాయలు పెట్టి (అది కూడా ఒక్కటి కాదు జంటగానే కొనాలంటా అంటే మొత్తం 100 రూపాయలు.. అది వాళ్ల రూల్ మరి అక్కడ) కొన్న కొబ్బరికాయను బయటే పగులగొట్టి.. తన భార్య దాహం తీర్చాడంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కొట్టొచ్చినట్టుగా సిబ్బంది నిర్లక్ష్యం..


ఇంత జరుగుతుంటే.. అక్కడ పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ.. చీమ కుట్టినట్టు కూడా లేరంటే ఆశ్చర్య పడాల్సిన విషయమే. కాలు విరిగిన మహిళ నడవలేక ఏడుస్తుంటే.. కనీసం ఆమెకు ప్రథమ చికిత్స చేసే వైద్యుడు లేకపోవటం శోచనీయం. ఆ ఆఫీసర్ మెల్లిగా ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టుకుని తీరిగ్గా 11 గంటలకు వచ్చి.. అక్కడే ఉన్న ఆశా వర్కర్లను.. ఏం ఏర్పాట్లు చేయలేదేంటీ అని అడగటం అవాక్కయ్యే విషయం. ఇక.. అక్కడక్కడా ఉన్న పోలీసులు.. ఏదో చేస్తున్నట్టుగా అటూ ఇటూ తిరగటానికి సరిపోయింది తప్ప.. చేసిందేమీ లేదు.


ఇదంతా జరుతుందని బాహ్య ప్రపంచానికి తెలియకుండా నెట్‌వర్క్ లేకపోవటంతో.. ఈ దుర్భర పరిస్థితులేవీ మీడియాకు కూడా తెలియలేదు. దీంతో.. పోలీసులు కూడా పెద్దగా స్పందించలేదు. ఇక ట్రాఫిక్ జామ్ అయ్యిందన్న విషయం తెలుసుకుని చాలా ప్రశాంతంగా వాళ్లు కూడా 11 తర్వాతే.. హాడావుడిని ప్రదర్శిస్తూ వచ్చి చూడటం గమనార్హం. అయితే.. అంత హడావుడి నటించినా.. హిమాయత్ నగర్ గ్రామంలోనే నలుగురైదుగురు ట్రాఫిక్‌ను సరిచేస్తూ కనిపించారు తప్పా.. ఆలయానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవటం చాలా దారుణం.


అంబులెన్సుకు కూడా దారి దొరకనంతగా..


బయట రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యిందన్న విషయాన్ని మీడియాకు తెలిసింది కానీ.. ఆలయంలో తొక్కిసలాట జరిగిందని, అందులో చాలా మంది పరిస్థితి అనారోగ్యానికి గురయ్యారని తెలియలేదు. సుమారు 25 నుంచి 30 మంది మహిళలు అనారోగ్యానికి గురికాగా.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రావాల్సిన అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవటం మరింత బాధాకరం. పోలీసులు చేయవల్సిన పనులు.. భక్తులే చేసి అంబులెన్సులను ఆలయం వరకు చేర్చటం అభినందనీయం. మరోవైపు.. ఎక్కడా పెదవులు తడుపుకునేందుకు కూడా ఆలయం సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటంతో.. రోడ్డువెంట మహిళా భక్తులు స్పృహ తప్పి పడిపోతుండటం చూసి.. చాలా మంది స్వచ్ఛందంగా నీళ్లు అందిచారు. హిమాయత్‌నగర్‌లో ముస్లిం సోదరులు వాహనదాలుకు, నడగదారుల దగ్గరికే వెళ్లి మరీ నీళ్లు అది కూడా చల్లని నీళ్లు ఇవ్వటం అభినందనీయం.



Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM