ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

byసూర్య | Thu, May 02, 2024, 08:37 PM

లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రిజర్వేషన్లు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీనే ఆ ప్రయత్నం చేస్తోందని అధికార బీజేపీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇదే అంశం ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోని సీఎం రేవంత్ రెడ్డి.. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని సమీక్షించాలని 2000లో ఓ గెజిట్‌ జారీ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నపుడు.. రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ చేసిన ప్రసంగంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందని పేర్కొన్నారు. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని తెలిపారు. తాను చేసిన వాదనలపై సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాలకు ఉందని చెప్పారు. ఇక ఎన్నికల్లో గెలవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటోందని మండిపడ్డారు.


అంతేకాకుండా కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం సరైంది కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎన్‌జీ వైద్య.. 2015లో పత్రికల్లో వ్యాసాలు రాశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్‌జీ వైద్య రాసినట్టుగానే.. 2025 నాటికి దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను సవరించాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలని.. రిజర్వేషన్ల రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతోందని చెప్పారు.


భారతదేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక సిద్ధాంతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీలకు సమానత్వం, హక్కులు లేని దేశం కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘ్‌ చాలక్‌ గోల్వాల్కర్‌ రాసినట్లు గుర్తు చేశారు. దళితులకు దురదృష్టవశాత్తు సమాన హక్కులు ఇచ్చారని ఆయన రాశారని పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని సూచించారని.. ఆయన చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గతంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్‌ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.


బీసీలకు 27శాతం రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫారసు చేసినప్పుడు బీజేపీ ఉద్యమం చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లు సమ్మతమేనని 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలా మార్చకూడదా అనే అంశంపై మాత్రమే జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమే ఉపయోగపడతాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా తనను బెదిరించే ప్రయత్నం విరమించుకోవాలని.. వాళ్ల ముందు లొంగిపోతానని ఆ ఢిల్లీ సుల్తానులు ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని రేవంత్‌రెడ్డి అన్నారు.


Latest News
 

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే Fri, May 17, 2024, 03:32 PM
కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ Fri, May 17, 2024, 03:31 PM
ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు Fri, May 17, 2024, 03:30 PM
వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 02:55 PM
మహబూబాబాద్ లో అశోక్ ప్రచారం.. భారీ స్పందన Fri, May 17, 2024, 02:50 PM