byసూర్య | Thu, May 02, 2024, 08:20 PM
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ను దాటింది. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో 46.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ జిల్లాలోని పలు మండలాలు 46.5 నుంచి 46.2 డిగ్రీల ఎండలు రికార్డయ్యాయి.
నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్ జిల్లాలోని 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతోపాటు ఖమ్మం నగరంలో తీవ్ర వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వడదెబ్బతో బుధవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట బూడిగజంగాల కాలనీకి చెందిన దివ్యాంగ బాలుడు కల్లెం యశ్వంత్(5), జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మహ్మద్ మొహినొద్దీన్ (52), ఆదిలాబాద్ జిల్లా పర్పులపల్లెకు చెందిన ఆత్రం జంగు (48) వడదెబ్బతో కుప్పకూలి చనిపోయారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బదావతి హటియా(68), కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ఆటోడ్రైవర్ రొడ్డ నర్సయ్య(46), హనుమకొండ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన పత్తిపాక రమేశ్(55) వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5వ తేదీ వరకు వడగాలుల ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త అవసరమన్నారు. నీరు ఎక్కువగా తీసుకోవాలని.. బయటకు వెళ్లాళ్సి వస్తే తలపై టోపీ, గొడుగు వంటివి పెట్టుకోవాలని సూచించారు.