byసూర్య | Tue, Apr 16, 2024, 08:07 PM
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ రామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా.. భద్రాద్రి రామయ్య ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రేపు (ఏప్రిల్ 17న) రాములవారి కల్యాణం జరగనుండగా.. సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక ప్రారంభమైంది. గరుడపటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించింది. గరుడమూర్తికి ప్రసాదాన్ని ఆరగింపు చేసి భక్తులకు అందించారు.
ఇక కల్యాణ క్రతువులో పాల్గొనడం, దగ్గరుండి కల్యాణాన్ని చూడటం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. భక్తులందరూ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఆలయ ఈవో గుడ్న్యూస్ చెప్పారు. ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు ఆపివేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. దర్శనంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం నిరంతరాయంగా అన్నదాన సదుపాయం ఉంటుందన్నారు. భక్తులకు అక్కడే ఉచిత తలంబ్రాలను కూడా ఇస్తామని వెల్లడించారు.
రాములోరి తలంబ్రాలు హోం డెలివరీ.. రూ. 151 చెల్లిస్తే చాలు
మిథిలా మండపానికి సమీపంలో రాములవారి కల్యాణోత్సవ వేడుకను దగ్గర్నుంచి చూసేందుకు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశామని ఈవో చెప్పారు. అందుకు సంబంధించిన రూ.10 వేలు, రూ.5 వేల టికెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే విక్రయించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమ్మలో ఉన్నందున రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో కల్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏడాది మాదిరిగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతివ్వాలని దేవాదాయ శాఖ ఈసీకి లేఖ రాసింది. స్వామివారి కల్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని సీఈవోను మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ విజ్ఞప్తిపై ఈసీ స్పందించాల్సి ఉంది.