byసూర్య | Tue, Apr 16, 2024, 06:54 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. లిక్కర్ స్కాంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మొదట ఈడీ అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న తీహార్ జైలులో ఉన్న సమయంలోనే.. సీబీఐ కూడా అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. అయితే.. ఇప్పటికే సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు తోసిపుచ్చగా.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానా.. విచారణను మరోసారి వాయిదా వేసింది. జడ్జి కావేరీ భవేజా సెలవులో ఉండటంతో బెయిల్ పిటిషన్పై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో.. ఈనెల 22వ మధ్యాహ్నం బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనుంది.
లిక్కర్ స్కాం కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని సాధారణ బెయిల్ పిటిషన్లో కవిత పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని కవిత చెప్పుకొచ్చారు. అలాగే.. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారంటూ తెలిపారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే.. తనను ఈ కేసులో అరెస్ట్ చేసి విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు కవిత.
మరోవైపు.. కవిత తరపు వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని.. ఆమ్ ఆద్మీ పార్టీకి. సౌత్ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కాంలో భాగంగా రూ.100 కోట్ల ముడుపులు వ్యవహారంలో కవితదే కీలక పాత్రగా పేర్కొంటున్నారు. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాగ్స్ చేరవేతలో కవిత ప్రధాన పాత్ర పోషించారని.. వాటికి సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా తన ఫోన్లో డేటాను డిలీజ్ చేశారంటూ కోర్టు దృష్టికి ఈడీ తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే.. ఈడీ నోటీసులు ఇచ్చాక తన వాట్సాప్ డేటాను కవిత డిలీట్ చేశారని అధికారులు ఆరోపించారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారని పేర్కొన్నారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని... ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. అరుణ్ను బెదిరించి వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులకు ప్రభావితం చేయగలరని.. ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ అధికారులు వాదిస్తున్నట్టు సమాచారం.