నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్

byసూర్య | Fri, Mar 29, 2024, 07:28 PM

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీలో అయితే.. ఊహాతీతం. ఎప్పుడు ఏ నేత కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడో తెలియటం లేదు. పార్టీలోని అగ్రనేత అయిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైపోవటం.. గులాబీ నేతలను విస్మయానికి గురి చేసింది. అయితే.. కే కేశవరావు, ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఇద్దరూ పార్టీ మారనున్నట్టు గత వారం రోజులుగా వార్తలు ప్రచారమవుతుండగా.. తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించేశారు. అయితే.. తన తండ్రి, సోదరి పార్టీ మారటంపై కేకే తనయుడు విప్లవ్ కుమార్ స్పందించారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌లో చేరినా.. తాను మాత్రం కేసీఆర్ వెంటే ఉంటానంటూ స్పష్టం చేస్తూ.. ప్రెస్ నోట్ విడుదల చేశారు.


అయితే.. కేకే పార్టీ మారటం వెనుక ఉన్న అసలు కారణాన్ని విప్లవ్ కుమార్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని తన తండ్రి నిర్ణయించుకున్నారని.. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల తాను చాలా బాధపడ్డానని విప్లవ్ కుమార్ చెప్పుకొచ్చారు. అందరికంటే ఎక్కువగా ఆయనను తాను గౌరవిస్తానన్న విప్లవ్.. ఈరోజు ఈ దశలో పార్టీకి ఆయనలాంటి సీనియర్ రాజనీతిజ్ఞుడు కావాలని అభిప్రాయపడ్డారు. ఆయన అనుభవంతో, తమ నాయకుడు కేసీఆర్‌‌కు ఆయన మద్దతుతో ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పెంచడానికి కృషి చేయాలనుకున్నామని విప్లవ్ తెలిపారు.


పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో.. ఈ వయసులో పార్టీలు మారడం వల్ల ఎవరికి ఏం లాభం అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన విప్లవ్ కుమార్.. ఇప్పుడు 84 ఏళ్ల కేకేను పార్టీలో చేరమని ఎందుకు వేడుకున్నట్టు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు గుర్రపు స్వారీ చేయొద్దని.. ప్రజా తీర్పును గౌరవిద్దామని ప్రమాణ స్వీకారోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.


కేకేకు తమ నాయకుడు కేసీఆర్.. ఎంత గౌరవం ఇచ్చారో తనకు తెలుసని విప్లవ్ కుమార్ తెలిపారు. పార్టీలో ఉన్నత స్థాయిలో నిలబెట్టారని చెప్పారు. అయితే.. కేకే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరన్నారు. ఏ అధికారం కోసమో, పదవి కోసమో కేకే కాంగ్రెస్‌లోకి వెళ్లట్లేదని.. కూతురి ఒత్తిడి వల్లో లేదా ఆమెపై ప్రేమ వల్లో పార్టీ మారుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇక.. మేయర్ విజయలక్ష్మి గారి విషయానికొస్తే.. 2016లో కార్పొరేటర్‌గా, 2021లో మళ్లీ టికెట్ ఇచ్చి ఆమెకు రాజకీయ జన్మనిచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ అని అందరికీ తెలుసన్నారు. ఆమెను మేయర్‌గా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిందన్నారు. మేయర్ అనేది నేరుగా ఎన్నికైన పదవి కాదని.. బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లపై గెలుపొందిన కార్పొరేటర్లంతా తన నాయకుడు కేసీఆర్ సూచన మేరకు ఆమెను మేయర్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈరోజు ఆమె కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని.. కానీ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పొందిన తన మేయర్ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచిస్తున్నట్టు విప్లవ్ కుమార్ తెలిపారు. అలా చేయకుండా వెళ్తే.. ఆమె పార్టీకి ద్రోహం చేసినట్టుగా భావిస్తానని తెలిపారు.



Latest News
 

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సాధారణ పరిశీలకుడు Sat, Apr 27, 2024, 06:39 PM
నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి Sat, Apr 27, 2024, 06:35 PM
గోడ దూకుడు పై మహిళల నిరసన Sat, Apr 27, 2024, 06:32 PM
ఈఎస్ఐ ఆసుపత్రికి సొంత భవనం నిర్మించాలి Sat, Apr 27, 2024, 06:23 PM
కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం - బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Sat, Apr 27, 2024, 06:21 PM