byసూర్య | Sat, Mar 02, 2024, 11:38 AM
హైదరాబాద్ : బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి.ఇక సీరియల్లో నటించిన నటీనటులను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్లో ఇంద్రనీల్ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు పవిత్రనాథ్. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ''పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి'' అంటూ ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.