byసూర్య | Sat, Sep 23, 2023, 07:10 PM
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. పరీక్షల్లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పరీక్షను రద్దు చేస్తూ ఇవాళ ఆదేశాలిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు, ప్రతివాదనలు విన్న హైకోర్టు దీనిపై తుది తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి లీకేజ్ వ్యవహారం బయటపడింది. దీంతో టీస్పీఎస్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. తాజాగా రెండో సారి కూడా గ్రూప్ 1 పరీక్ష రద్దైంది. మళ్లీ గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. పరీక్ష రెండోసారి కూడా రద్దు కావటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కు టీఎస్పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.