byసూర్య | Sat, Sep 23, 2023, 07:33 PM
హైదరాబాద్ ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని షేక్పేట్ గురుకుల పాఠశాల హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో విద్యార్థులు వినాయకుడిని ఏర్పాటు చేయగా.. దేవుడి వద్ద పెట్టిన దీపం ప్రమాదశాత్తు దుప్పట్లకు అంటుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట అలిజాపూర్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియకుండా కొందరు విద్యార్థులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు మూడోరోజు విగ్రహాలను నిమజ్జనం చేయించారు. అయితే థర్డ్ ఫ్లోర్లోని కొందరు విద్యార్థులు తాము తెచ్చిన విగ్రహాన్ని రహస్యంగా దాచి ఉంచారు.
గతరాత్రి గణేషుడికి దీపారాధన చేశారు. అనంతరం దేవుడి వద్ద పెట్టిన దీపం ఆరిపోకుండా ఉండేందుకు కప్పుకునే దుప్పట్లను నలువైపులా కట్టి ఉంచారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత బయట నుంచి బలమైన గాలులు వీచాయి. దీంతో దీపం దుప్పట్లకు అంటుకుంది. అయితే రాత్రి కావడంతో విద్యార్థులు గాఢ నిద్రలోకి జారిపోయారు. దుప్పట్లకు మంటలు అంటుకోవటాన్ని ఎవరూ గమనించలేదు. గదిలో దట్టమైన పొగ అలుముకోవటం, ఊపిరి ఆడకపోవటంతో కొందరు విద్యార్థులు కళ్లు తెరచిచూశారు. గది మొత్తం మంటలు అంటుకోవటంతో.. విద్యార్థులు బటయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఎలా బయటకు రావాలో వారికి అర్థంకాలేదు. ఎంత అరచినా ఎవరు కాపాడేందుకు ముందుకు రాలేదు.
శేరిలింగంపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న నీరజ్, రజనీకాంత్ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు గాయపడ్డ ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సకాలంలో విద్యార్థులు అందరూ బయటకు పరుగులు తీయటంతో పెను ప్రమాదం తప్పింది.