byసూర్య | Sat, Sep 23, 2023, 06:11 PM
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ను నార్కోటిక్ పోలీసులు నేడు ప్రశ్నించారు. నర్సింగ్ రావు, సునీతా రెడ్డి నేతృత్వంలో.. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. నవదీప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న దేవరకొండ సురేష్, రామచంద్రతో ఉన్న పరిచయాలపై నవదీప్ను అధికారులు ఆరా తీశారు. సురేష్, రామచంద్ర అకౌంట్లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేయటంతో.. దానిపై నార్కోటిక్ అధికారులు ఆరా తీశారు. దాంతోపాటు సురేష్, రామచంద్రలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నలు అడిగారు. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై కూడా ఆరా తీశారు. మాదాపూర్లో జరిగిన డ్రగ్ పార్టీలకు హాజరయ్యారాన్న ఆరోపణలపై కూడా విచారణ చేశారు. నవదీప్పై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. పబ్లో డ్రగ్స్ సరఫరాపై వస్తున్న ఆరోపణలపై కూడా వివరాలు సేకరించారు.
అయితే.. అధికారులు అడిగిన ప్రశ్నలకు నవదీప్ కొన్ని సరైన సమాధానాలు ఇవ్వగా.. మరికొన్నింటినీ దాటవేశారని తెలుస్తోంది. అయితే.. డ్రగ్స్ తీసుకోవడం తానెప్పుడో మానేశానని నవదీప్ చెప్పినట్టు తెలుస్తోంది. నిందితుడు రామచంద్ తనకు 10 ఏళ్ల క్రితమే పరిచయమని తెలిపారు. తాను ఎవరికి డ్రగ్స్ అందచేయలేదని నవదీప్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, సినీ రంగ ప్రవేశం, వ్యాపారాలు, బిజినెస్ పార్టనర్స్.. ఇలా ప్రతీ ఒక్కదానిపై క్షుణ్ణంగా అడిగారు. డ్రగ్స్ ఎలా, ఎప్పుడు అలవాటు.. నుంచి మొదలు.. డ్రగ్స్ కొనుగోలు వరకు అన్ని వివరాలను అధికారులు అడిగారు. అయితే.. కొన్ని ప్రశ్నలకు మాత్రం నవదీప్ సమాధానాలు దాటేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు చాలా బ్యూటీఫుల్గా విచారణ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రూట్ లెవల్లో ఉన్న లింకులు కూడా తెలుసుకునేలా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఏడేళ్ల క్రితం ఫోన్ డాటాను కూడా సేకరించి.. లింకులపై క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తున్నట్టు వివరించారు. అయితే.. తన బిజినెస్ లావాదేవీల విషయంలో ఉన్న లింకుల ఆధారంగా గతంలోనూ సిట్, ఈడీ విచారణలకు హాజరైనట్టే ఇప్పుడు కూడా విచారణకు వచ్చానని తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు నవదీప్. అయితే.. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని.. వార్తలు రాయాలంటూ మీడియాకు సూచించారు.