byసూర్య | Sat, Sep 23, 2023, 06:15 PM
మాదాపూర్లోని రహేజా మైండ్ స్పేస్లో 2 భారీ భవనాలను కూల్చివేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. B7, B8 అనే ఈ రెండు భవనాలను కేవలం 5 సెకన్లలో నేలమట్టం చేశారు. వీటి పక్కనే భారీ బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రెండు భవనాలను పేక మేడల్లా కూల్చివేశారు. భవనాల కూల్చివేతల్లో విశేషమైన అనుభవం ఉన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. అధికారులు ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కూల్చివేతకు ముందు అలారం మోగించారు. గతంలో ఇలాంటి ప్రక్రియను నోయిడాలో నిర్వహించారు.
మైండ్స్పేస్ ప్రాజెక్టు రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేత అనంతరం ఆ ప్రాంతంలో భారీగా దుమ్మూ, ధూళి అలుముకుంది. రహేజా మైండ్ స్పేస్లోని B బ్లాక్లోని ఈ రెండు భవనాలు కాస్త దూరంలో వేర్వేరుగా ఉన్నాయి. నాలుగంతస్తుల ఈ భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రెండు భవనాలను కొంత కాలం కిందటే.. అధునాతన రీతిలో నిర్మించారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల భవనాలకు సమస్యలు రావడంతో కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భవనాలకు పక్కనే వెస్ట్రిన్ హోటల్ ఉంది. ఈ భవనాల కూల్చివేతకు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఒక క్రమ పద్ధతిలో పేలుడు ప్రక్రియ నిర్వహించారు.
ఈ బిల్డింగులు కూల్చివేసిన ప్రదేశాల్లో భారీ భవనాలను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి భవనం ప్రాంతంలో 1.3 మిలియన్ల చదరపు అడుగులతో, రెండో భవనం ప్రాంతంలో 1.6 మిలియన్ల చదరపు అడుగులతో కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రెండు ప్రాజెక్టులు 2026 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.