byసూర్య | Wed, Apr 14, 2021, 08:13 AM
కేటీఆర్కు కండ్లు నెత్తికెక్కి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవడు అని ఏకవచనంతో మాట్లాడటంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ను ఆయన హెచ్చరించారు. గతంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కాళ్లు మొక్కిన సంగతి కేటీఆర్ మరిచిపోయినట్లున్నాడని చురకలంటించారు. కేసీఆర్ని తిడితే కేసులు పెడతామని కేటీఆర్ చెబుతున్నాడని, కానీ, ఆ సంస్కృతిని తెచ్చిందే కేసీఆర్ అని ఆయన విమర్శించారు. అసలు తిట్ల దండకాన్ని ఆపాలని ముందు కేసీఆర్కు చెప్పాలని భట్టి సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలంటే టీఆర్ఎస్, బీజేపీకి ఒక వ్యాపారంలా మారిపోయాయని, ఓటర్లను డబ్బులతో కొనడం అలవాటైపోయిందన్నారు. లేదా ఎన్నికలప్పుడే అభివృద్ధి పేరిట శంకుస్థాపనలు, లేనిపోని హామీలిచ్చి పోలింగ్ తర్వాత మర్చిపోవడం రెండు పార్టీలకు మామూలేనని విమర్శించారు. సాగర్ ఎన్నికల్లోనే టీఆర్ఎస్, బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని భట్టి పేర్కొన్నారు.