byసూర్య | Wed, Oct 21, 2020, 11:44 AM
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోగాల ముప్పు పొంచి ఉంది. ఎక్కడికక్కడే బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల చుట్టే నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో రోగాలు విజృంభించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలే కరోనా కాలం... ఈ సమయంలో ఇతర జబ్బులు వస్తే తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని అంటున్నారు. తాగునీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు. చాలా కాలనీలు, బస్తీలు నీట మునగడంతో అందుబాటులో ఉన్న నీటినే తాగే అవకాశముంది. దీని వల్ల రోగాల బారిన పడే ప్రమాదముందంటున్నారు. మంచినీరు, మురికి నీరు కలవడం వల్ల కలరా వంటి వ్యాధులు సోకే అవకాశముంది. అంతేకాకుండా సరఫరా చేసే నీటిలో క్లోరినేషన్ సరైన మోతాదులో లేకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని డాక్టర్లు వివరించారు.
వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన వారు వేడి నీటితో స్నానం చేయాలి. రోడ్లపై ఉండే నీటిలో ఎక్కువగా నడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. వర్షపు నీటిలో చెప్పులు లేకుండా తిరగవద్దు. తడిసిన చెప్పులను శుభ్రంగా తుడిచి పెట్టాలి. ఇంటికి వచ్చిన తరువాత కడిగిన కాళ్లను పొడిబట్టతో శుభ్రంగా తుడవాలి. వేడి చేసి చలార్చిన నీటిని తాగాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజ్ తప్పని సరిగా వినియోగించాలి. వేడి ఆహారన్నే తీసుకోవాలి. నీటిలో క్లోరిన్బిళ్లలు కలిపి శుద్ధి చేయాలి. జలుబు, దగ్గు, జ్వరం, నీరసం ఉంటే బయటకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండాలి అని డాక్టర్లు వివరించారు.