సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు.. మే 1న విచారణకు రావాలని ఆదేశాలు

byసూర్య | Mon, Apr 29, 2024, 07:43 PM

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలన్ని రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన రిజర్వేషన్ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తూ.. సోషల్ మీడియాలోనూ ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదులు నమోదయ్యారు. ఆ ఫిర్యాదుల మేరకు సీఆర్పీసీ 91 కింద.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మే 1వ తేదీన విచారణకు హాజరై.. అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


అమిత్‌ షా ప్రసంగానికి చెందిన వీడియోను కట్ చేసి.. ఫేక్‌ వీడియోను పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్‌ చేశారంటూ బీజేపీ నేతల నుంచి ఫిర్యాదులు అందాయి. పీసీసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లోనూ ఈ ఫేక్ వీడియోను పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు అందింది. దీంతో.. ఆ వీడియోను వైరల్ చేస్తున్న పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందన్నది కూడా పోలీసులు కనుక్కుంటున్నారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఢిల్లీ పోలీసులు స్వయంగా గాంధీ భవన్‌కు వచ్చి మరీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు.. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతి కుమారికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.


ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు కౌంటర్లు వేస్తుండగా.. రాజకీయ దుమారం చెలరేగుతోంది. కొన్నిసార్లు.. నేతలు చేస్తున్న కామెంట్లో, వాటికి ప్రత్యర్థులు చేసే కౌంటర్లో మిస్ ఫైర్ కూడా అవుతూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన అమిత్ షా.. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ప్రసంగించారు.


ఆ వ్యాఖ్యలను తీసుకుని ముందు వెనుక తీసేసి.. దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి కచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ చెప్పినట్టుగా మార్ఫ్ చేసి.. ఫేక్ వీడియోనూ సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే.. ఆ వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువులు కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు.


Latest News
 

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ ధరలు Thu, May 16, 2024, 03:08 PM
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ Thu, May 16, 2024, 03:05 PM
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి Thu, May 16, 2024, 03:01 PM
రాజకీయాలు తప్ప రైతుల కష్టాలు పట్టవా?: కేటీఆర్‌ Thu, May 16, 2024, 01:55 PM
ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులు Thu, May 16, 2024, 01:06 PM