byసూర్య | Wed, Oct 21, 2020, 11:34 AM
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ కోసం 80 మంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సర్కిళ్లవారీగా మొత్తం 235ముంపు ప్రాంతాల్లో వీరు సహాయక చర్యలు చేపడుతారని తెలిపారు. మంగళవారం నుంచే విధులు ప్రారంభించాలని కమిషనర్ స్పష్టంచేశారు. ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ, వైద్యం, పోలీసు, విద్యుత్, వాటర్బోర్డు తదితర అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని పేర్కొన్నారు. వీరు స్థానిక డిప్యూటీ కమిషనర్కు రిపోర్ట్ చేస్తారన్నారు.
ప్రత్యేక అధికారులు నిర్వహించనున్న విధులు
ముంపు ప్రాంతాల్లోని నివాసముంటున్నవారిని ఖాళీ చేయిస్తారు. మొదటి, రెండవ అంతస్తులో ఉన్నవారిని సైతం ఖాళీ చేయిస్తారు.
వారిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మంచినీరు, దుప్పట్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చుతారు.
పునరావాస కేంద్రాల వద్ద మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుచేస్తారు.
ముంపు ప్రాంతాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటు
పునరావాస కేంద్రాల వద్ద అన్నపూర్ణ కేంద్రాల ఏర్పాటు
ముంపు ప్రాంతాల్లో క్రిమిసంహారక ద్రావణాల పిచికారీ, పారిశుధ్య పనుల నిర్వహణ
స్ట్రక్చరల్ ఇంజినీర్లు, టౌన్ప్లానింగ్ అధికారుల సహకారంతో ముంపు ప్రాంతాల్లోని ఇండ్లు, అపార్ట్మెంట్ల దృడత్వ తనిఖీల నిర్వహణ. ఒకవేళ దృడత్వం లేనిపక్షంలో అందులో ఉండేవారిని ఖాళీ చేయిస్తారు.
ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు