byసూర్య | Mon, Oct 19, 2020, 11:41 AM
శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు వరంగల్లోని భద్రకాళి అమ్మవారు భక్తులకు గాయత్రిదేవిగా సోమవారం దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో సింహవాహన సేవ నిర్వహించారు. సాయంత్రం గజవాహన సేవ జరుగుంది. భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రాద్ది కొత్తగూడెం జిల్లాలో విజయదశమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
భద్రాచలంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఉప ఆలయంలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. అమ్మవారు భక్తులకు గజలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహానివేదన భోగభాగ్యం, సాయంత్రం 6 గంటలకు దర్బార్సేవ, రాత్రి 7 గంటలకు మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, సామాహిక కుంకుమార్చన పూజలు పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో మహిళలకు ఆలయ అధికారులు అవకాశం ఇచ్చారు. మంగళవారం అమ్మవారు ధాన్యలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు.
బాసరలో జాన్ఞ సరస్వతీ అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సుహాసిని పూజ, మంత్ర పుష్పం, మహా హారతి తదితర ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. నాల్గో రోజు మంగళవారం అమ్మవారు కుష్మాండ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.