byసూర్య | Mon, Jun 17, 2019, 04:00 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్సీ పదవి ఉన్నా... పాల్వాయి కుటుంబాన్ని కాదని టికెట్ ఇచ్చారని గుర్తు చేసిన ఆయన.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంపీ సీటు ఇచ్చారు.. నల్గొండలో చాలా మంది కార్యకర్తలు ఉన్నా కోమటిరెడ్డి కుటుంబానికి దక్కినన్ని పదవులు ఎవరికి రాలేదన్నారు. మీ అన్నకి జడ్పీటీసీ, మీ ఆవిడకు ఎమ్మెల్సీ సీటు తీసుకున్నావ్... గెలిస్తే.. నాదే విజయం... ఓడిపోతే ఉత్తమ్, జానారెడ్డిల మీద నిందలు వేస్తావా? అంటూ రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీహెచ్. క్రమశిక్షణ కమిటీ వేరేవాళ్ళు అయితే పార్టీ నుండి సస్పెండ్ చేసే వాళ్లు.. కానీ, తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆయన.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశవాది.. బయటకు పోతేనే కాంగ్రెస్ కి మంచి జరుగుతుందన్నారు.
రాహుల్ గాంధీ.. సలహాదారులు ఆయన్ని తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు వీహెచ్... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీది తప్పేమీలేదన్న ఆయన.. ఇందిరా, సంజయ్ గాంధీలు గోరంగా ఓడిపోయినా బయపడలేదు.. నిలబడి... మళ్ళీ అధికారంలోకి వచ్చారని.. రాహుల్ గాంధీ ఉంటేనే పార్టీకి బలం... రాహుల్ ఉండే.. పార్టీని నడిపించాలని విజ్ఞప్తి చేశారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లను పక్కన పెట్టండి అని రాహుల్ను కోరిన వీహెచ్.. అబద్ధాలు చెప్పే భజనపరులను దూరం పెట్టాలని.. అందరిని కలిసి... దిద్దుబాటు చర్యలకు దిగాలని.. కోవర్టులను రాహుల్ పక్కన పెట్టాలని కోరారు. ఇక, వచ్చేవి అన్ని కార్యకర్తల రోజులే.. అవకాశవాదులు పోతే పోనీ అని వ్యాఖ్యానించారు వీహెచ్. మరోవైపు కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్నారని మండిపడ్డారు.