byసూర్య | Tue, Feb 05, 2019, 03:07 PM
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, తూర్పు ఉత్తరప్రదేశ్ పార్టీ రథ సారథి ప్రియాంక గాంధీ భేటీ అయ్యారు. అమెరికా నుంచి ఇండియా చేరుకున్న ప్రియాంక.... రాహుల్ తో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పశ్చిమ విభాగం ఇన్ఛార్జ్ జ్యోతిరాదిత్య సింధియాతో పాటు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, కర్నాటక జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రియాంక రాకతో ఇప్పటికే సిద్ధం చేసిన పార్టీ ప్రచార ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. 13 భారీ బహిరంగ సభలు నిర్వహించాలనుకున్న పార్టీ ఆ సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలు ప్రియంక ఇంచార్జ్ గా ఉన్న తూర్పు పరిధిలోనే ఉన్నాయి. ఈ నెల 9న జరగనున్న పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశానికీ ప్రియాంక హాజరుకానున్నారని సమాచారం.