byసూర్య | Thu, Oct 17, 2024, 04:22 PM
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్.ఎల్.బి.సీ బత్తాయి మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇరువురు మంత్రులు కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. గడచిన 5 సంవత్సరాలలో రైతుకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నదని, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్ల కార్డులు కలిగిన రైతులకు ఇది వరకే 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి తెల్ల కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమచేస్తామని తెలిపారు. 2 లక్షల రూపాయల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎట్టి పరిస్థితులలో ఈ పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతోపాటు, పంట కాలానికి 7500 రూపాయలు రైతు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా చేస్తామని వెల్లడించారు. అలాగే ఈ సంవత్సరం నుండే రైతు పంటల బీమా ను సైతం అమలు చేస్తామని, రైతులు ఏ పంట వేసినా.. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు పంట బీమా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులు ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పత్తిని సైతం అలాగే తేవాలని, ఈ సంవత్సరం తెలంగాణలో కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ తయారుకానుందని తెలిపారు. జనవరి నుండి రేషన్ కార్డుల ద్వారా అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, అందుకే సన్న రకాలకు మద్దతు ధర తో పాటు, 500 రూపాయల బోనస్ వస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ,అదరపు కలెక్టర్ జి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.