byసూర్య | Tue, Oct 15, 2024, 09:37 PM
తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రహదారుల అభివృద్ధి, విస్తరణ, కొత్త రోడ్ల మంజూరుపై చర్చించారు. అందుకు సానుకూలత వ్యక్తం చేసిన గడ్కరీ హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణతో పాటుగా.. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నల్గొండ పట్టణం గుండా బైపాస్ రహదారిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేషనల్ హైవే 565లో సాగే ఈ రహదారి నకిరేకల్ - నాగార్జునసాగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. మెుత్తం రూ.516 కోట్లతో 14 కి.మీ. మేర 4 వరుసల బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ మేరకు ఆ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు నితిన్ గడ్కరీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీకి ఈ 565 జాతీయరహదారి అత్యంత ప్రధానమైనదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలోని నకిరేకల్ కూడలి నుంచి మొదలయ్యే ఈ నేషనల్ హైవే నల్గొండ, ఏపీలోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం నల్గొండ నుంచి సాగే రహదారితో భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. తాజాగా మంజూరు చేసిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దాంతో పాటుగా నకిరేకల్ - నాగార్జునసాగర్ మధ్య అనుసంధానం కూడా మెరుగవుతుంది. ప్రజల సురక్షితమైన ప్రయాణానికి ఈ రహదారి మేలు చేకూరుస్తుందని గడ్కరీ ట్వీట్ చేసారు.
కాగా, రహదారి మంజూరు, నిధుల కేటాయింపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా బైపాస్ నిర్మాణాన్ని చేపట్టాలంటూ కేంద్ర మంత్రిని కోరుతూ వస్తున్నానని చెప్పారు. తాజాగా.. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే.. రద్దీ నుంచి వాహనదారులు ఉపశమనం పొందుతారని అన్నారు. నకిరేకల్- నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.