ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్

byసూర్య | Sat, Oct 26, 2024, 09:28 PM

మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో శుక్రవారం (అక్టోబర్ 25) ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచమంతా హైదరాబాద్‌ నగరం వైపు చూసేలా.. అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. గుజరాత్‌లో వల్లభాయ్ పటేల్‌ విగ్రహంలా.. హైదరాబాద్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.


తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను ఈ సందర్భంగా రేవంత్ వివరించారు. ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందీ విడమరిచారు.


ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం.. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఉత్తర, దక్షిణ భారత్‌ అని విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దక్షిణాదిపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధులు ఇవ్వటం లేదన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై ఒత్తిడి పెంచే ఆలోచన ఉందని.. అవసరమైతే ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహణకు తానే చొరవ తీసుకుంటానని చెప్పారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.


మూసీ పునరుజ్జీవాన్ని, బాపూఘాట్‌ అభివృద్ధిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ నిర్మించారు కదా.. తాము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు ? అని ప్రశ్నించారు. తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామని అందుకే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను... రైజింగ్ తెలంగాణగా, రైజింగ్ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM