byసూర్య | Tue, Oct 15, 2024, 09:38 PM
తెలంగాణలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. తద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. ఇక రాష్ట్ర యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు.. వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు దొరికేందుకు గాను ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ పలు రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో కలిసి తొలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను రాష్ట్రంలో నెలకొల్పనుంది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడ గ్రామంలోఈ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు గ్రామంలోని సర్వే నం.90లోని రెండు ఎకరాల స్థలాన్ని సెంటర్ ఏర్పాటుకు అనుమతించారు. తాజాగా.. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మెుత్తంగా రూ.42.64 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మెుత్తంలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.31.01 కోట్లు వ్యయం చేయనుంది. ఈ నిధులతో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన సాఫ్ట్వేర్, ఆధునిక యంత్రాలు, హ్యుమన్ రిసోర్స్ సమకూర్చనుంది. సెంటర్ నిర్మాణ పనులు, లైటింగ్, ఇతర ఖర్చుల కింద మిగిలిన డబ్బులను రేవంత్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ఈ టెక్నాలజీ సెంటర్లో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు ఉండనున్నాయి. అందులో 244 సీట్లు అందుబాటులో ఉంటాయి. అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్-48, ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్-20, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్ -48, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నషియన్-40, మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్-48, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్-40 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సెంటర్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. టీటీఎల్ సంస్థ ఐదేళ్ల పాటు ఏటీసీలకు అవసరమైన టెక్నాలజీ, ఇతర హ్యుమన్ రిసోర్స్ను సమకూరుస్తుంది. ఐదేళ్ల తరువాత మారుతున్న ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా సెంటర్లో కొత్త కోర్సులు, టెక్నాలజీ, ఇతర మానవ వనరుల కోసం అగ్రిమెంట్ పొడిగించుకునే ఛాన్స్ ఉంది. ఈ టెక్నాలజీ సెంటర్లో చదువుకున్న వారికి తప్పనిసరిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు ఉపాధి కల్పనశాఖ చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కార్మికశాఖ వర్గాలు వెల్లడించాయి.