అన్నదాతకు తీపి కబురు.. రైతుభరోసాపై కీలక అప్డేట్, వారికి మాత్రమే డబ్బులు

byసూర్య | Tue, Sep 24, 2024, 10:08 PM

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీని మెుత్తం మూడు విడతల్లో పూర్తి చేసింది. దాదాపు రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెక్నికల్ సమస్యల కారణంగా అర్హులైన మరికొందరు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు. అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందించేందుకు గాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తోంది. కాగా, రైతు రుణమాఫీ అమలు కావటంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారు.


కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి మెుత్తం రూ. 15 వేలు పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది. దసరా (అక్టోబర్ 12) నుంచి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.


ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎకరాకు రూ.7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వచ్చే నెల తొలివారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 7,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే గత ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో అందించింది. అప్పట్లో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇక ఎన్ని ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.


ఇక ఈసారి బడ్జెట్లో రైతుభరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగైన భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.



Latest News
 

ప్రజావాణి ఫిర్యాదు లపై సత్వర పరిష్కారం చూపాలి Tue, Sep 24, 2024, 10:34 PM
పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను మంత్రి పరిశీలన Tue, Sep 24, 2024, 10:32 PM
మినీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి Tue, Sep 24, 2024, 10:29 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం Tue, Sep 24, 2024, 10:26 PM
ప్రజావాణి కి 179 దరఖాస్తులు స్వీకరణ Tue, Sep 24, 2024, 10:25 PM