తెలంగాణలో త్వరలోనే మరో కొత్త రాజకీయ పార్టీ

byసూర్య | Mon, Sep 23, 2024, 08:57 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, టీజేఎస్, కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు ఉండగా.. ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. కాగా.. ఇప్పుడు మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకునే అవకాశం ఉంది. అది కూడా బీసీ నినాదంతో రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు.. రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశాయి. త్వరలో.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని.. తప్పకుండా పార్టీ పెడతామని ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో పరిశీలనలో ఉందని.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున.. అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా.. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు, పలువురు బీసీ కులసంఘాల నాయకులు హాజరయ్యారు.


ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. గతంలో 10 మంది బీసీ నాయకులు పార్టీ పెట్టినా విజయవంతం కాలేకపోయారని.. ఈసారి తాము మాత్రం సరైన సమయం చూసి పెడతామని ప్రకటించారు. మరోవైపు.. కాంగెస్ ప్రభుత్వం.. తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారన్నారు. ఈసారి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోకపోతే.. అసలు రిజర్వషన్లే లేకుండా చేస్తారని హెచ్చరించారు.


కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని.. ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వచ్చిందని గుర్తు చేసిన కృష్ణయ్య.. తెలంగాణలోనూ అలాంటి ప్రమాదం ఉందని తెలిపారు. అవసరమైతే.. రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.


తెలంగాణలో మరో భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. త్వరలో నిర్వహించబోయే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమమే రాబోతుందని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సెగ కేంద్ర ప్రభుత్వానికి కూడా తాకబోతుందని ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM