byసూర్య | Mon, Sep 16, 2024, 07:15 PM
కులవృత్తులను ప్రొత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కల్లు గీత కార్మికులను ప్రమాదాల బారిన పడకుండా కాపాడేందుకు కాటమయ్య రక్ష సెఫ్టీ కిట్లను తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ సీఎం రేవంత్ రెడ్డి ఈ కిట్లను ఆవిష్కరించటంతో పాటు గీత కార్మికులకు అందజేశారు. అప్పటి వరకు రాష్ట్రవ్యా్ప్తంగా 3 వేల మంది గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు గీత కార్మికుల కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు వివరాలు వెల్లడించారు.
గౌడన్నలకు కిట్ల పంపిణీతోపాటు వాటిని ఉపయోగించడంపై ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్ అందజేస్తున్నామన్నారు. రూ.12 వేల విలువ కలిగిన ఈ కిట్ను ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. మెుత్తం రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 80 వేల మంది గీత కార్మికులు ఉన్నారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 100 చొప్పున 100 నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 3 వేల కిట్లు పంపిణీ చేయగా.. మిగిలినవి వచ్చే నెలలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గీత కార్మికుల ప్రమాదాలు, మరణాలు పదేండ్ల నుంచి గణనీయంగా పెరిగాయి. కల్లు తీసే సమయంలో మోకుల ముడి ఊడిపోవటం, చెట్లు ఎక్కేటప్పుడు జారటంతో కార్మికులు తాటిచెట్ల మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో 775 మంది గీత కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2 వేల మంది శాశ్వతంగా వైకల్యం పొందారు. దీంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురవకుండా సేఫ్టీ కిట్లు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు డిసైడ్ అయ్యారు. గత రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది పథకం అమల్లోకి వ్చచింది.
కాటమయ్య కిట్లు అందుకున్న గౌడన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చెట్లు ఎక్కేటపుడు దిగేటపడు ఈ కిట్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని.. ఎటువంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. కల్లు తీసేందుకు ఉపయోగించే కుండలు తగిలించినా బరువుగా లేదని అంటున్నారు. నడుంకు పెట్టుకునేందుకు 3 బెల్ట్లు ఉన్నాయి అవి తమను ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు. రూ. 12 వేల విలువ కలిగిన కిట్ను ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వటం అభినందనీయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.